ఆచార్య శరత్జ్యోత్స్నారాణి,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.
వీచేగాలిలో ఏముందో!
పీల్చే మనిషికి ఏమవుతుందో!
చూస్తూనే వున్నాను! ఇలాగే
ఎందుకు ఎప్పుడు జరుగుతుంది! వెంకట రమణ
తెలియక అడుగుతున్నాను.
ఏడుకొండలపై వెలసిన నీకు
మనుషుల జాతకాలు, మర్మాలు తెలుసు.
తెలిసే ఊరకున్నావా! ఎంతమంచివాడవు స్వామీ!
మన అమ్మాయి శిల్ప విషయంలో
నాదేశం, నా ప్రజలు అంటున్నారు.
బ్రిటీష్ వారిది జాతి వివక్ష అట.
నిజం చెప్పవు! నారాయణ
మనకు లేదా! కుల వివక్ష
ఏ వివక్ష అయినా కూల్చేది
మనిషిని, మానవత్వాన్ని.
ప్రపంచీకరణ దిశలో పలు దేశాలు
పరుగులు తీస్తున్నా, మంచికి తావు లేని
ఇసుకటెడారులు.
ఆయుధంతో పనిలేదు!
గాయపర్చే గుండెలేని మనుషుల మధ్య
మనుగడ మృగ్యం రమణ .
చరిత్ర మూలాల్లో కుళ్ళిపోయిన
కుల సంస్కృతిని పూడ్చి పెట్టలేని అలసత్వం
ఎన్నోసార్లు ఎందరినో బలినొంది.
గాంధీపై తెల్లదొర గురిపెట్టిన జాతి వివక్ష,
అంబేడ్కర్ని బలిగొన్న నల్లవాడి కులవివక్ష,
సద్దాంని ఉరితీసిన సామ్రాజ్య వాదపు కక్ష
ఏది! రగులుతున్న అగ్నిజ్వాలలను ఆపిందా!
ప్రశ్నించే వాళ్ళు! పలకరించే మానవతావాదులెందరో!
ఏదేశంలోనైనా విహరించే శ్వేతపావురాలు శాంతికి చిహ్నాలు!
ప్రపంచంలో సంచరించే మనిషి
హద్దులతో సరిహద్దుల గీతంలో ఆవాసం చేస్తున్నాడు.
సాహిత్య సంసృతులు
మతాల కోసం కులాల కోసం పుట్టినవేనన్న సంగతి తెలిసిన
ప్రాజ్ఞుడవు .
మౌనంగా చూస్తావెందుకు?
అంతా మాయ మిధ్యేనని మామధ్యకు రాకున్నా
ఒక సారి పలకరించవా ఓ పరమాత్మ!

ఆచార్యులు, గురువు గారు, మాతృ సమానురాలు అయిన మేడం గారి కవితలో ఆలోచనాత్మక అంశాలు ఉన్నాయి. అంబేడ్కర్ గారు గురించి మాట్లాడడం నాకు ఆనందంగా ఉంది.
అచార్యులు,మాతృసమానులు,అయిన మేడంగారికి ముందుగా నమస్కారాలు.
మీరు చెప్పెన కవితలో కులంలోన,జాతిలోన రోజు రోజు మగ్గిపోతున్న ప్రజల జీవితాలు కనిపిస్తున్నాయి.కులం అనే కుళ్ళులో పూడుకుపోయిన వారికి ఈ కవిత ఒక మంచి గుణపాఠం చెప్పగలదు.”కులం వద్దు,మతం వద్దు,కూడు గుడ్డ కావాలి” అని అందరూ అలోచించే విధంగా ఈ కవితా చాల బాగవుంది.