-లక్ష్మణరావు , (ఎం.ఏ),
హైదరాబాదు విశ్వవిద్యాలయం.
ఎప్పటికప్పుడు మారుతున్న ఈ నవ సమాజంలో ఇప్పటికీ, ఎప్పటికీ అగ్ర తాంబూలం తప్పకుండా ఇంగ్లీష్కే చెందుతుందేమోనన్న ఆలోచన వస్తేనే ఎంతో బాధనిపిస్తుంది. తెలుగు భాషని ఇంగ్లీషు పదాలతో ఎంగిలి చేస్తున్న ఈ దుస్థితి చూస్తుంటే ఏమాత్రమూ సాహితీ సౌరభాన్ని గ్రోలని విద్యార్ధులము, మనకే ఇంత బాధగా ఉంది. ఇక ఈ సమయంలో నన్నయ్య పుట్టి ఉంటే ఆంధ్ర మహాభారతాన్ని కూడా పండిత ప్రశంసల కోసం ఇంగ్లీషులోనే రచించి ఉండేవాడేమో…! ఎందుకులే అది ఊహించలేని పరిస్థితి.
అమ్మానాన్నలు కూడా తమ పిల్లలు మమ్మీ డాడీ అని పిలిస్తే మా వాళ్ళకి ఇంగ్లీషు మీడియం చదువు బాగా అబ్బుతున్నదంటూ చెప్పలేనంత ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. యువత తెలుగు వచ్చి కూడా రానట్లు ఇంగ్లీషు సంపర్కంతో తెలుగుని కలగలిపి, రాని యాసని కూడా ఆసతో నాలుకకు నేర్పించి మరీ మాట్లాడేస్తున్నారు. చక్కగా తెలుగుని మాట్లాడక పోగా తొక్కలో…అంటూ అపహాస్యం చేస్తున్నారు.
ఇది ఇలాగే కొనసాగితే, కొన్నాళ్ళకు తెలుగులో సంస్కృత పదాలున్నట్లే ఇంగ్లిషులోతెలుగు పదాలుండే నకిలీ తెలుగు వస్తుందేమో? మనమిప్పుడు సంస్కృతంలో దేవతలు మాట్లాడుకునే వారంట! అని చెప్పుకుంటున్నట్లుగా భావితరాలవారు ‘తెలుగులో మన పూర్వులు మాట్లాడేవారంట‘ అని చెప్పుకుంటారేమో! అమ్మో ఆ దుస్థితి ఎన్నటికీ కలుగకూడదు. ఈ ఆలోచనే తట్టుకోలేని మనము అటువంటి పరిస్థితులు చూడకుండా కాస్త ముందు తరంలో పుట్టినందుకు సంతోషపడాలా ఏంటి? నిజంగా నాకు సిగ్గేస్తున్నది!.
కానీ ఏ రోజుకైనా తెలుగు పట్ల అభిమానం ప్రజల్లో అంకురించి తెలుగులో మాట్లాడటమే ఒక ఫ్యాషన్ అన్న ధోరణి వస్తే ఎంతో బాగుంటుంది. ఏమవుతుందొ ఏమో కానీ ఈ భావనే చాలా సంతృప్తినిస్తున్నది. అందుకే కరుణశ్రీ ఇలా అంటాడు.
“ఒకమారు వెనుకకు తిరిగి చూచి
దిద్దుకోవమ్మ!బిడ్డల తెనుగు తల్లీ”.
నిజమేనండి..కానీ అలా జరగదు లెండి…మనం ఇలా మన తెలుగులో ఎంతో కొంత కృషి చేస్తున్నంత కాలం, మన తెలుగుకి ఢోకా ఉండదు.. ఐతే తల్లి దండ్రులు తమ పిల్లలకు తెలుగుని సరిగ్గా నేర్పించడంలో కొంచెం శ్రద్ధ తీస్కుంటే సరిపోతుంది అని నా అభిప్రాయం.
please all telugu people save our telugu,Governement should take action telugu will be teaching for all collages & Schools